Leading News Portal in Telugu

Drugs: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పాకిస్థానీయుల అరెస్ట్



Coast

గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పాకిస్థానీయులను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో మంగళవారం ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. ఎన్‌సీబీ, గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ.400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సోమవారం రాత్రి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పోరుబందర్‌ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్‌ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్‌ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్‌లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్‌ చేసేందుకు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే గుజరాత్‌ తీరంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.

ఈ మధ్య కాలంలో అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించింది. ఎన్‌సీబీతో సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇదే తీరంలో 3,300 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు.