Leading News Portal in Telugu

Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్‌కి ఖుష్బూ రాజీనామా..


  • జాతీయ మహిళా కమిషన్‌కి ఖుష్బూ సుందర్ రాజీనామా..

  • క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం..

  • తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న ఖుష్బూ..
Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్‌కి ఖుష్బూ రాజీనామా..

Khushbu Sundar: ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేందుకే ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది.

బుధవారం రోజు ఎక్స్ వేదికగా ఆమె తన నిర్ణయాన్ని పంచున్నారు. ‘‘రాజకీయాల్లో 14 ఏళ్ల అంకితభావం తర్వాత ఈ రోజు తన మనసు పరివర్తనను సూచిస్తుంది. మా పార్టీ బీజేపీకి సేవ చేయాలనే నా అభిరుచిని పూర్తిగా స్వీకరించేందుకు జాతీయ మమిళా కమిషన్‌కి రాజీనామా చేశాను’’ అని ఆమె ఎక్స్ వేదికగా ప్రకటించారు. జాతీయ మహిళా కమిషన్‌లో పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ మహిళా కమిషన్‌లో తన సేవలకు కొన్ని పరిమితులు ఉండటంతో, ఇప్పుడు రాజీనామా తర్వాత తనను తాను పూర్తిగా బీజేపీ మిషన్‌కి అంకితం చేసుకునే వీలు కలుగుతుందని ఆమె తన పోస్టులో వెల్లడించారు. తాను ఇప్పుడు హృదయపూర్వకంగా సేవ చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం ‘కమలాలయం’లో జరిగే జెండా కార్యక్రమానికి హాజరుకానున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి ఖష్బూ సుందర్ ప్రముఖ నాయకురాలిగా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని కుష్బూ మద్దతుదారులు స్వాగతించారు.