- కర్ణాటక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు..
-
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 25 వేల డెంగ్యూ కేసులు నమోదు.. -
డెంగ్యూను అంటు వ్యాధిగా ప్రకటించిన కర్ణాటక సర్కార్.. -
దోమలను అరికట్టే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ప్రభుత్వం

Karnataka Govt: కర్ణాటక రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూను అంటు వ్యాధిగా కన్నడ సర్కార్ పేర్కొంది. గతేడాది 5 వేల డెంగ్యూ కేసులు నమోదు అవగా.. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 25 వేల కేసులు నమోదు అయ్యాయి. గత దశబ్దకాలంలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. డెంగ్యూ కేసుల తీవ్రత అధికంగా పెరుగి పోతున్నందున ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు రెడీ అయింది.
ఇక, తక్షణమే రాష్ట్రమంతటా దోమల నివారణ చర్యలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఫాగింగ్ చేయడం, దోమల లార్వాలను చంపేందుకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో రసాయనాలు స్ప్రే చేయడం లాంటివి అధికం చేయాలని అధికారులకు సీఎం సిద్ధరామయ్య సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో దోమలను అరికట్టే నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక నుంచి భారీగా జరిమానా విధించనున్నట్లు తెలిపింది. దోమలు పెరిగే స్థావరాలు ఉంటే ఆయా భవన యాజమాన్యాలకు, వ్యాపార సముదాయాలకు ఫస్ట్ జరిమానా విధించి, తీరు మార్చుకోక పోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది.