Leading News Portal in Telugu

Coimbatore: ప్రియుడితో లాడ్జికి వెళ్లిన యువతి.. మరుసటి రోజు శవంగా కనిపించింది..


  • ప్రియుడితో లాడ్జ్‌కి వెళ్లిన యువతి..

  • ఇద్దరి మధ్య లవ్.. కుటుంబాలకు తెలియకుండా పెళ్లి..

  • వాగ్వాదంతో ముఖంపై దాడి చేసిన ప్రియుడు..

  • గోడకు తల తగిలి మృతి చెందినట్లుగా అనుమానం..
Coimbatore:  ప్రియుడితో లాడ్జికి వెళ్లిన యువతి.. మరుసటి రోజు శవంగా కనిపించింది..

Coimbatore: ప్రియుడితో లాడ్జ్‌కి వెళ్లిన యువతి శవమై కనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. లాడ్జిలో ముఖంపై రక్తంతో యువతి కనిపించినట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. రెండు రోజుల క్రితం యువతి, తన భాగస్వామితో లాడ్జికి వెళ్లింది. ప్రాథమికి నివేదికల ప్రకారం.. గీత అనే యువతి శుక్రవారం రాత్రి శరవణన్ అనే వ్యక్తితో కలిసి లాడ్జ్‌లో రూం తీసుకున్నారు. శనివారం ఉదయం శరవణన్ లాడ్జి నుంచి హడావుడిగా బయటకు వెళ్లాడు. హౌజ్ కీపింగ్ టీమ్ వీరిద్దరు ఉన్న గదిలోకి వెళ్లగానే గీత మృతదేహం కనిపించింది.

వెంటనే అప్రమత్తమైన లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం శరవణన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. శరవణన్, గీత ప్రేమించుకున్నారు. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నప్పటికీ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ వివాహానికి గీత కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి హాస్టల్‌లో ఉంటున్న గీత, శరవణన్‌ను లాడ్జిలో కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శరవణన్ గీత ముఖంపై బలంగా కొట్టడంతో ఆమె తల గోడకు తగిలి మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పీలమేడు పోలీసులు శరవణన్ పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103(ఐ) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.