Leading News Portal in Telugu

Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..


  • అరవింద్ కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం..

  • ఆయన నిజాయితీ గురించి ఢిల్లీ ప్రజలకు తెలుసు..

  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర..

  • ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అతిశీ కామెంట్స్..
Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..

Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని బీజేపీపై అతిషీ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది అరవింద్ కేజ్రీవాల్.. కేజ్రీవాల్‌ను తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే కొద్ది నెలల పాటు కృషి చేస్తాను.’’ అని ఆమె అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం కావడం ఆప్‌లోనే సాధ్యమని అన్నారు. ‘‘నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, బహుశా నాకు ఎన్నికల టిక్కెట్ కూడా ఇచ్చేది కాదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నన్ను నమ్మి, నన్ను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేసి, ఈ రోజు నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు 14 పోర్ట్‌ఫోలియోలను అతిశీ చూస్తున్నారు.

సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వడం కేంద్రానికి చెంపెట్టని ఆమె అన్నారు. కేజ్రీవాల్‌ని తిరిగి సీఎంగా ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ గురించి ప్రజలందరికీ తెలుసని, ఢిల్లీ ప్రజకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ని సీఎం చేస్తారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ సీఎం కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్స్, ఉచిత వైద్యం ఉండవని చెప్పారు.