Leading News Portal in Telugu

Stuck In Bengaluru Flyover Jam Commuters Abandon Vehicles Walk Home


  • బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్..

  • వాహనాలను వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బెంగళూరు ట్రాఫిక్ జామ్..
Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు

Bengaluru Traffic: భారతదేశంలో ట్రాఫిక్‌ జామ్‌ అంటే తొలుత గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరే. కొద్దీ దూరానికే గంటలు గంటలు వేచి చూడటం బెంగళూరు వాసులకు అలవాటుగా మారిపోయింది. ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో బెంగళూరు ఉంది. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహా నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కిలో మీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌ మీడియాలో తెలియజేస్తున్నారు.

అయితే, తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం మహానగరంలో భారీ వర్షం పడింది. దీంతో ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున జామ్‌ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగు చెందిన కొందరు వాహనాలను వదిలి పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు నీటిలోనే నదులను తలపిస్తున్నాయి. దాంట్లో ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ 5 మంది చనిపోయినట్లు సమాచారం.