వాజ్పేయికి ఎయిమ్స్లో వైద్య పరీక్షలు
భారత మాజీ ప్రధాన మంత్రి, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజ్పేయి సోమవారం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. డాక్టర్ల సూచన మేరకు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్పేయికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాజ్పేయి ఆరోగ్యం బాగుందని, డాక్టర్ రణ్దీప్ గులేరియా పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ పేర్కొంది. కాగా, గత మూడు దశాబ్దాలుగా వాజ్పేయికు వ్యక్తిగత వైద్యుడిగా డాక్టర్ గులేరియా సేవలందిస్తున్నారు.
#UPDATE Atal Bihari Vajpayee's condition is stable and a team of doctors under the supervision of Dr Randeep Guleria, Director AIIMS are conducting tests: All India Institute of Medical Sciences
— ANI (@ANI) June 11, 2018
భారతీయ జనతా పార్టీ తొలి ప్రధాన మంత్రిగా చరిత్రకెక్కిన వాజ్పేయి 1924లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. పూర్తిగా ఐదేళ్లు భారతావనిని పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరించిన ఘనత వాజ్పేయిది. 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి భారత ప్రధానిగా ఉన్నారు. భారత్కు ఈయన పదో ప్రధాని. 1996లో 13 రోజుల స్వల్ప కాలం ఆయన తొలిసారి ప్రధాన మంత్రి పీఠం ఎక్కారు. ఆ తవారత రెండోసారి మాత్రం పూర్తికాలం పనిచేశారు. మొత్తంగా 10 సార్లు వాజ్పేయి లోక్సభకు ఎన్నికవ్వడం విశేషం. ఒక్క లక్నో నుంచే ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1991, 1996, 1998, 1999, 2004లో వాజ్పేయి లక్నో లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు.
ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి హోదాలో హిందీలో ప్రసంగించిన తొలి నేత వాజ్పేయి. 1992లోనే భారత ప్రభుత్వం వాజ్పేయిని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక 2015లో దేశ అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న వాజ్పేయిని వరించింది. 2009 ఎన్నికల తరవాత పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసిన వాజ్పేయి.. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.