Leading News Portal in Telugu

షాక్ ఇచ్చిన ఎస్ఈసీ రమేష్ కుమార్… వైసీపీకి ఎదురుదెబ్బ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీలకు మరో షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినప్పటికీ, ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాబట్టి, ఎవరూ ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తే వారి వివరాలు పంపాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాశారు. వెంటనే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ నెలకొన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1000ని వైసీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు పంపిణి చేస్తున్నారని, దీన్ని గుర్తు పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల ఎస్ఈసీ రమేష్ కుమార్‌కు లేఖ రాశారు.

పేదలకు ఇస్తున్న రూ.1000లో కూడా అధికార పార్టీ నేతలు రూ.200, రూ.300 కట్ చేసుకుని ఇస్తున్నారని కొన్ని పేపర్లు, టీవీ చానళ్లలో వార్తలు వస్తున్నాయనే విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఎస్ఈసీ రమేష్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం పూర్తిగా పేదలకు చేరకపోవడం మరింత బాధాకరమైన విషయమని అన్నారు. అదే సమయంలో పేదల వద్దకు వెళ్లే వారు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోవడం లేదని, పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, దీని వల్ల వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సాయం విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జోక్యం చేసుకోకుండా చూడాలని ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టాన్ని ఉపయోగించి వారిని డిస్ క్వాలిఫై చేసి జైలుకు పంపాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా ఇదే విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో రమేష్ కుమార్ జిల్లాల్లో యంత్రాంగానికి లేఖలు రాశారు.