బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊశారో… తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యం భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్ , లేదా ఉమ్మి ఊయటం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం.’ అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404గా ఉండగా… ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 500 చేరొచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. రాష్ట్రంలోని 100 గ్రామాలు, ప్రదేశాల్ని హాట్ స్పాట్లుగా గుర్తించాలని డిసైడైంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్నే ఈ టాప్ 100 లిస్టులో పెట్టి… అక్కడ ఎక్కువ కండీషన్లు పెట్టబోతోంది. ఈ హాట్స్పాట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వచ్చే 14 రోజుల పాటూ ఇళ్లలోంచి బయటకు రానివ్వకుండా చేస్తారు. వారికి కావాల్సిన సరుకులు, మందులు అన్ని డోర్ డెలివరీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ విధానం అమలుచేస్తోంది. ఇలాంటి ప్రాంతాల్ని రెడ్ జోన్ అని పిలుస్తోంది.