Lockdown Extension | లాక్ డౌన్ పొడిగింపు… ప్రధాని క్లారిటీ.. ఎప్పటి వరకు?
భారత్లో కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ను పొడిగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లాక్ డౌన్ను పొడిగించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నాం.’ అని ప్రధాని మోదీ అన్నారు. దీంతో లాక్ డౌన్ పొడిగింపు ఖాయం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 24వ తేదీన లాక్ డౌన్ ప్రకటించారు. దేశాన్ని కాపాడేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, కరోనాను అంతం చేసేందుకు మూడు వారాలు ఎవరూ బయటకు రావొద్దని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అయితే, ఇప్పటికి రెండు వారాలు గడిచాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5000కు పైగా పెరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఉందని, ఇన్ని రోజులుగా చేపట్టిన లాక్ డౌన్ వల్ల ఉపయోగం ఉండదనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ పొడిగించాలని కుండబద్దలు కొట్టారు. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాలని తమ పార్టీ ఎంపీలకు చెబుతామని కేసీఆర్ చెప్పారు.
అయితే, లాక్ డౌన్ ఎన్ని రోజులు పొడిగిస్తారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు వారాలు పొడిగిస్తారా? లేకపోతే గతంలోలాగా మరో మూడు వారాలు ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.