Leading News Portal in Telugu

సాధారణ ప్రజలు హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ వాడారో… ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక…

కరోనా వైరస్ నియంత్రణలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సంజీవనిగా పిలుస్తున్న హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ (సహజంగా దీన్ని మలేరియాను తగ్గించేందుకు వినియోగిస్తారు)‌పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. సాధారణ ప్రజలు దీన్ని వాడొద్దని హెచ్చరించారు. వైద్యుల అనుమతి ఉంటే దీన్ని వాడాలని స్పష్టం చేశారు. అలా కాకుండా, ఏ దగ్గో జలుబో, జ్వరమో వచ్చిందని, సొంతంగా వెళ్లి హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ మాత్రలు తెచ్చుకుని వేసుకుంటే ప్రమాదమని వార్నింగ్ ఇచ్చారు. దాని వల్ల హార్ట్ బీట్‌లో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘కోవిడ్ 19 మీద హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ బాగా పనిచేస్తుంని కొన్ని పరీక్షలు చెబుతున్నాయి. అయితే, ఆ డేటా మరీ అంత స్ట్రాంగ్ కాదు.’ అని డాక్టర్ గులేరియా ANI న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ అనేది అందరికీ వాడకూడదని డాక్టర్ గులేరియా స్పష్టం చేశారు. ‘ఈ డ్రగ్‌కు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ అనేది గుండె కవాటాల మీద ప్రభావం చూపి.. గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతకు దారితీస్తుంది. అన్ని ఇతర డ్రగ్స్ లాగానే, దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలకు దీని వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. కాబట్టి, వైద్యులు చెప్పకుండా దీన్ని తీసుకోవద్దు.’ అని డాక్టర్ స్పష్టం చేశారు.

కోవిడ్ 19 పేషెంట్లకు చికిత్సలో భాగంగా హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్ కాంబినేషన్‌ను డాక్టర్లు వినియోగిస్తున్న అంశంపై స్పందిస్తూ ‘ఈ రెండూ కలిపి ఇవ్వడం వల్ల ఫలితాలు ఉన్నట్టు చైనా, ఫ్రాన్స్‌లో పరిశోధనల్లో తేలింది. ఆ డేటా సైజ్ సరిపోదు. ప్రస్తుతం మరో చికిత్స ఏదీ లేదు కాబట్టి, దాన్నే వాడుతున్నారు.’ అని అన్నారు. హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఫార్మా కంపెనీలు ఈ నెలలో 20 కోట్ల ట్యాబ్లెట్లను తయారు చేశాయి. హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ కావాలంటూ అమెరికా సహా పలు ప్రపంచదేశాలు భారత్‌ను కోరాయి. ఇప్పటికే పలు దేశాలకు భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.