Leading News Portal in Telugu

భారత్‌లో 9వేలు దాటిన కరోనా కేసులు.. 308కి చేరిన మృతుల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 796 కొత్త కేసులు నమోదవగా.. 35 మంది చనిపోయారని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిది. మొత్తంగా దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,152కి చేరింది. దేశంలో కరోనా వైరస్‌తో పోరాడి ఇప్పటి వరకు 856 మంది కోలుకోగా.. 308 మంది చనిపోయారు. ప్రస్తుతం 7,897 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో 35 మంది చనిపోగా.. అందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 22 మంది ఉన్నారు. ఢిల్లీలో ముగ్గురు, గుజరాత్‌లో ముగ్గురు, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు, తమిళనాడు, ఏపీ, జార్ఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

భారత్‌లో ఇప్పటి వరకు 2,06,213కి కరోనా పరీక్షలు చేసినట్లు ICMR తెలిపింది. 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో సరుకు రవాణాకు అడ్డంకులు సృష్టించకూడదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయా రాష్ట్రాలకు సూచించారు.