Leading News Portal in Telugu

బీర్ అనుకొని యాసిడ్ తాగాడు.. మద్యం కష్టాలకు మరొకరు బలి

లాక్‌డౌన్‌తో మద్యం ప్రియులు విలవిల్లాడుతున్నారు. చుక్క మందు లేక అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో వేలకు వేలు పోసి బాటిల్స్ కొంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్య మందు బాబులు.. పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్స్ ఫాపులు తెరుచుకుంటాయా? అని ఎదురుచూస్తున్నారు. ఐతే లాక్‌డౌన్ మే3 వరకు పొడిగించడంతో వారికి కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు టర్పెంటైన్‌లో కూల్‌డ్రింక్ కలుపుకొని తాగుతున్నారు. మరికొందరు ప్రొపైల్ ఆల్కాహాల్‌ను సేవిస్తున్నారు. ఇలా ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఐతే మద్యం కష్టాలకు తాజాగా మరొకరు బలయ్యారు. యాసిడ్‌ను బీర్‌గా భావించి తాగడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఈ ఘటన చోటుచేసుకుంది.

చక్కీ ప్రాంతానికి చెందిన సురేష్ సజాల్కర్ (50) మద్యానికి బానిసయ్యాడు. ఐతే లాక్‌డౌన్‌తో వైన్ షాపులు మూతపడడంతో మందు దొరక్క అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఓ చోట బీర్‌ బాటిల్ కనిపించింది. కొన్ని నెలల కింత ఆ బాటిల్‌లో యాసిడ్ పోసి నిల్వచేశారు. ఆ విషయాన్ని గమనించని సురేష్.. బాటిల్‌ను చూసిన వెంటనే ఓపిక పట్టలేక గడగడతాగేశాడు. అనంతరం కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. యాసిడ్‌ను తాగడంతో శరీర అంతర్భాగాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మే 3 వరకు దేశ్యవాప్తంగా లాక్‌డౌన్ పొడిగించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. మే 3 వరకు రాష్ట్రంలో సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు మూసివేసి ఉంటాయని చెప్పారు. ఏప్రిల్ 20 వరకు మద్యం షాపులు తెరచుకోవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత వైన్ షాపులు ఓపెన్ అవుతాయేమోనని.. మందు బాబులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 53 మంది మరణించారు. ప్రస్తుతం 870 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.