కరోనాపై కేంద్రానికి రాహుల్ గాంధీ కీలక సూచనలు
కరోనా వైరస్ను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రానికి పలు కీలక సూచనల చేశారు. కరోనాను ఎదుర్కోడానికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి కొద్ది రోజులకు మాత్రమే ఈ లాక్డౌన్ వినియోగపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ర్యాండమ్ పరీక్షలు, వ్యూహాత్మకంగా పరీక్షలను నిర్వహించడం వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ అని రెండు జోన్లుగా విభజిస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా పరీక్షలు అతి తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని, వెంటనే ఆ సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం ద్వారా వైరస్ ఏ దిశగా కదులుతుందో తెలుసుకొని, మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిపై అన్ని రాజకీయ పార్టీలూ కలిసి కట్టుకగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎంత మాత్రమూ విమర్శలు చేయడం లేదని, ప్రభుత్వానికి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తాను చాలా అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో విభేదిస్తానని చెప్పిన రాహుల్ గాంధీ … ఈ సమయంలో మాత్రం కలిసికట్టుగా, ఐకమత్యంగా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు పోరాడతామని స్పష్టం చేశారు.