చంద్రబాబు సీఎంగా ఉంటే అలా జరిగేదన్న వైసీపీ ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకవేళ కర్మ కాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఉంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడని విమర్శించారు. పాజిటివ్ రోగులను దాచాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఏం అవసరమని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మనవడితో ఆడుకోక మధ్యలో ఈ చిటికెలెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ పని చేసినా నిజాయితీ ఉండదని మండిపడ్డారు.
పనీపాట లేకపోవడమో, మీడియాలో కనిపించాలనే ప్రచారం పిచ్చి వల్లనో…లాక్ డౌన్ సమయంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరపడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. మీరు వాళ్లకు ఏం టాస్క్ ఇచ్చారు? ఈ సమయంలో వాళ్లు ఏం చేయగలరో ఆలోచించారా ? అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా ఇటువంటి వింతలు కనిపించవు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న చంద్రబాబు… పోలీసు పాస్ తీసుకుని అక్కడి పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చుగదా అని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు అండగా నిలుస్తున్నారని… అక్కడ ఆశ్రయం పొందుతున్నందుకైనా కొంత బాధ్యత తీసుకోవాలని సూచించారు.