1915లో లాక్ డౌన్… అందరికీ పెయిడ్ హాలిడే… అడ్వాన్స్ డబ్బులు
లాక్ డౌన్ అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. అదే లాక్ డౌన్ గతంలో కూడా పెట్టారు. బ్రిటిష్ ఇండియా కాలంలో. 19, 20 శతాబ్దాల్లో చాలా సార్లు కలరా, ప్లేగు వ్యాపించాయి. అయితే, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. అలాంటి వాటిలో కొన్ని లాక్ డౌన్లు, కంటైన్మెంట్ జోన్లు. ప్రస్తుతం వాడుతున్న భాషలో వాటిని అప్పుడు పిలవకపోయినా, అప్పట్లో వేరే పేరుతో పిలిచినా, అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్నది అదే. న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో లభించిన బ్రిటిష్ ఇండియా అధికారిక రికార్డుల ప్రకారం, బ్రిటిష్ ఇండియా మెడికల్ హిస్టరీ ఆర్కైవ్స్ డేటా ప్రకారం నిజాం ప్రభుత్వం కూడా లాక్ డౌన్ తరహా నిబంధనలను అమలు చేసింది. రైళ్లను నిలిపివేసింది. రైళ్లు నడిపితే రోగాలు మరింత వ్యాపిస్తాయనే భయంతో రవాణాను నిలిపివేసింది. బ్రిటిష్ ఇండియా సమయంలో షిప్లు కూడా నిలిపివేశారు.
స్పెషల్ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. (అప్పట్లో వాటిని కార్డన్ శానిటైజర్స్) అనే వారు. అక్కడ పోలీసులు, మిలటరీ సిబ్బంది కాపలా ఉండేవారు. కేవలం పోలీసు పాస్లు (అప్పట్లో దీన్ని ప్లేగ్ పాస్పోర్ట్) ఉన్నవారు మాత్రమే నగరాల్లో తిరగానికి అనుమతి ఉండేది. వారికి కూడా ప్రతి రెండు రోజులకు ఓసారి పరీక్షలు నిర్వహించేవారు.
ఇక వలస కూలీల విషయానికి వస్తే, బ్రిటిష్ ఇండియా కాలంలో కూడా ఈ సమస్య ఉంది. కూలీలు నివసించే ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో వారికి బస ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి రాకుండా చర్యలు తీసుకున్నారు. వలస కూలీలకు 32 రోజుల అడ్వాన్స్ శాలరీ కూడా ఇచ్చారు. వలస కూలీలను 500 మంది చొప్పున గ్రూపులుగా విభజించారు. వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించారు.