కరోనా ఆస్పత్రికి రేవంత్ సాయం.. రూ.50 లక్షల నిధుల కేటాయింపు
గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తనవంతు సాయం చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలను కేటాయించారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను కలిసి ఈ మేరకు నిధులు విడుదల చేయాలని లేఖ అందించారు. ఆ నిధులతో గచ్చిబౌలి ఆస్పత్రి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP)ని నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, గచ్చిబౌలిలోని స్పోర్స్ట్ కాంప్లెక్స్ని 1500 పడకల కోవిడ్ ఆస్పత్రిగా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఐతే అన్ని ఆధునాతన సదుపాయాలు కల్పించినప్పటికీ.. సీవరేజ్ ప్లాంట్ను నిర్మించలేదు. దాంతో ఆ భవనం నుంచి వచ్చే మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి చేరుతోంది. దీనిపై వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
HCU విద్యార్థుల సమస్యపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించి.. తను ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సీవరేజ్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.50 లక్షల నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్కు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, నందిగంటి శ్రీధర్ పాల్గొన్నారు.