Leading News Portal in Telugu

తెలంగాణ అలా..ఏపీ ఇలా.. జగన్ నిర్వాకమే కారణం!? | telangana progress ap retrat| jagan| failure| it| ruin| minister


posted on Aug 21, 2023 9:31AM

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి, తొమ్మిది సంవత్సరాలు నిండిపోయాయి.  2014 జూన్ రెండున ఉమ్మడి ఆంధ్ర్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాయి. అలా విడిపోయి తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏడు జరుగుతోంది.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. సంబురాలు చేసుకుంది. మరి, అవశేష అందర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి?  ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది.అవశేష ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.

రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దూరదృష్టితో.. ఆయనకే సాధ్యమైన విజన్ తో ప్రారంభించిన  రాజధాని అమరావతి నిర్మాణాన్ని, ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి     అటకెక్కించేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచనను తీసుకొచ్చి అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో నాలుగేళ్ళు గడిచిపోయాయి.  సెక్రటేరియట్ కాదు,అసలు రాజధానే లేని రాష్ట్రంగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మిగిలింది. ఇతర రాష్ట్రాలకు ఒక లాఫింగ్ స్టాక్ గా మారింది.  

మరోవంక, నీరు, నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగణ రాష్ట్రం ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. ఏవో కొన్ని అవకతవకలు ఉన్నా.. లోపాలు ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అందులో  ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన  పెడితే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంది. పంటలు పెంచుకుంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మరోవంక అవశేష ఆంద్ర ప్రదేశ్  రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న  జాతీయ ప్రాజెక్ట్  పోలవరం  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతం వరకూ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది.

ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి, రెండు రాష్త్రాల మధ్యా ఎంత తక్కువ పోలిక  తెస్తే అంత మంచిది.  తొమ్మిదేళ్లలో అవశేష ఆంధ్ర ప్రదేశ్   అన్ని విషయాల్లోనూ వెనకబడిన రాష్ట్రంగా మిగిలింది. వెనుకబాటు తనంలో, శాంతి భద్రతల పరిస్థితిలో బీహార్ ను అధిగమించేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  ఉమ్మడి రాష్ట్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నాటిన ఐటీ విత్తనాలు ఇప్పుడు మహా వృక్షాలుగా ఎదిగి  ఆ మహానగరం ఐటీ రంగంలో దూసుకు పోతోంది. అనేక దిగ్గజ  సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా, తెలంగాణ రాష్త్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక మేరకు  2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగంలో 31.44 శాతం అభివృద్ధి సాధించింది. తెలంగాణలో ఐటీఎగుమతులు రూ3904.55 కోట్లకు చేరుకున్నాయి,  

మరి ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇక్కడ కూడా అదే కథ. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా  కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి,ప్రభుత్వం మారి పోయింది. రాష్ట్రం ఐటీ అంటే మీటలు నొక్కడమే అనుకునే ముఖ్యమంత్రి ఏలుబడిలోకి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖ ఒకటుందని, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారని, ఆయన పేరు  గుడివాడ అమరనాథ్  అని చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అమర్నాథ్ మాటకు ముందొకసారి. వెనుక ఒకసారి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్తోత్రం చదువుతారు.  అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ, ఐటీ .. అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగవద్దని తప్పుకుంటారు. 

 .రాష్ట్ర విభజన సమయంలో  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. నిజమే. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా  వ్యవహరించింది. అదే అన్యాయాన్ని కొనసాగించింది. కొనసాగిస్తోంది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం   అంతకు ముందు  ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానాన్ని దారి మళ్ళించారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారం కలబోసి అభివృద్ధిని అటకెక్కించారు. అందుకే ఈరోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు, అనుకునే దయనీయ స్థితికి రాష్ట్రం చేరుకుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు  మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన తెచ్చుకోవడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు.