టీటీడీ బోర్డు సభ్యుడిగా శరత్ చంద్రారెడ్డి ప్రమాణం | sarat chandra reddy sworn in as ttd board member| dispute| appointment
posted on Sep 5, 2023 11:32AM
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పి. శరత్ చంద్రారెడ్డి మంగళవారం ( సెప్టెంబర్ 5)న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంలో నేరచరితులకు స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకాలను సవాల్ చేస్తు ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన ఆ పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ ముగ్గురిరీ టీటీడీ సభ్యులుగా తొలగించాలని పిటిషన్లో రోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అటువంటి బోర్డులో నేర చరితులు, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని పేర్కొన్నారు. అదలా ఉండగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్ణయాలను తీసుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే ఆ స్థానంలో భూమన కరణాకర రెడ్డిని కూర్చోబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నాస్తికుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తాయి.
భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తగా.. కాలినడకన వెళ్లే భక్తులకు ఊత కర్రలు ఇచ్చి క్రూర మృగాలను తరమాలనడంపై కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ విమర్శలు అలా కొనసాగుతుండగానే జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమించింది. జగన్ సర్కార్ ప్రకటించిన బోర్డు సభ్యులలో ఇద్దరి నియామకం తీవ్ర వివాదాస్పందంగా మారింది. వారిలో ఒకరు డిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై, అప్రూవర్గా మారి బెయిలుపై వచ్చిన శరత్చంద్రారెడ్డి కాగా, మరొకరు 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్. వీరిరువురినీ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంతో టీటీడీ దొరికిపోయిన దొంగలకు పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేతన్ దేశాయ్ ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేయగా.. తాజాగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి స్వయానా సోదరుడు.