Leading News Portal in Telugu

మాజీ ఎంపీ, నటి రమ్య కన్నుమూత..ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నదెవరు? | fake news on former mp actor ramya| dead| social| media| post| viral| who


posted on Sep 6, 2023 5:27PM

ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) కన్నుమూశారని ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ రమ్య గుండెపోటుతో బుధవారం ( సెప్టెంబర్ 6) తుదిశ్వాస విడిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.   అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహితలు చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఎవరి పని అని అభిమానులు ఆరా తీస్తున్నారు.  రమ్య తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అభిమన్యు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో ప్రియగా తన నటనతో కట్టిపడేసారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎంపీగా పనిచేశారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల విషయాలలో ఫెక్ న్యూస్ తలనొప్పులు సాధారణంగా వైరల్ అవుతుంటాయి.  సినీ సెలబ్రిటీల విషయంలో అయితే  ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. రాజకీయ ప్రముఖుల విషయంలో ఫలానా పార్టీలోకి మారుతున్నారు. మరో పార్టీతో మంతనాలు జరుపుతున్నారు వంటి వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. అంతవరకు ఓకే గానీ.. మరీ బతికున్న వ్యక్తులను చంపేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను సృష్టిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి , మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) విషయంలోనూ అటువంటి ప్రచారమే జరిగింది. ఆమె గుండెపోటుతో మరణించారంటూ  ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ అయ్యిందో లేదో  అలా ఆ వార్త నిమిషాల్లో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్లు, ఛానల్స్ సైతం ఆ వార్తను ప్రచారం చేశాయి. దీంతో పరామర్శలు స్టార్ట్ అయ్యాయి. రమ్య(దివ్య)కి, ఆమె సన్నిహితులకు పలువురు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈ ఫేక్ న్యూస్ గురించి తెలియక.. ఎక్కడో జెనీవాలో గాఢనిద్రలో ఉన్న రమ్య.. ఒక్కసారిగా ఈ న్యూస్ గురించి తెలిసి షాక్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నాను, ఎవరో ఏదో ట్వీట్ చేస్తే దానిని గుడ్డిగా ప్రసారం చేస్తారా అని రమ్య తనను సంప్రదించిన మీడియా వర్గాలు, సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట.

ఇటీవల కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ఆ వార్తనే కాస్త ఆలస్యంగా ‘స్పందన’కు బదులుగా పొరపాటున ‘దివ్య స్పందన’ అని రాసి పోస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా బతికున్న వ్యక్తులను చనిపోయారంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వార్తల వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కంగారు పడతారు. సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. అలాంటి వార్తల వల్ల  ప్రమాదం జరిగే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.