Leading News Portal in Telugu

సైబరాబాద్ సృష్టికర్త అక్రమ అరెస్టును ఖండించవా కేటీఆర్! | it employees demand ktr to condemn babu arrest| cyberabad| hyderabad| developement| visionary| global| city


posted on Sep 16, 2023 4:15PM

ఏపి స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కాం   ఆరోపణలతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏమో కానీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలతో కదం తొక్కారు..  తొక్కుతున్నారు. 

ఇటీవల విప్రో సర్కిల్ వద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చేయడమే కాకుండా.. తమ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామంటూ క్లియర్ కట్‌గా జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఐ యామ్ విత్  బాబు అంటూ చంద్రబాబుకు మద్దతుగా   ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా   ఆందోళనలు, కార్ల ర్యాలీలు సైతం చేపట్టారు. 

అయితే చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్   ఆందోళనలు, ధర్నాలకు దిగడంపై  పోలీసులు గరం గరం అవుతున్నారు. ఆ క్రమంలో సదరు ఈ ఆందోళనల్లో పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా ధర్నాలు ఆందోళనలకు దిగితే.. కఠిన చర్యలు తప్పవని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను హెచ్చరించారు. 

ఓ వేళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగితే… వారు విధులు నిర్వహిస్తున్న ఆయా కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ నగరం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే..   నాడు చంద్రబాబు నాయుడు దార్శనికతతో చేపట్టిన కార్యక్రమాల వల్లేనని వారు  అంటున్నారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఖండిచాలనీ, అది పోయి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై జులుం ఎమిటనీ నిలదీస్తున్నారు. 

హైదరాబాద్‌లో ఐటీ అభివృధికి బాటలు వేసింది నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇప్పటికే పలు వేదికల మీద నుంచి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  స్వయంగా ప్రకటించిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. తెలంగాణలో ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయిల మార్క్ దాటిందంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో మీడియా సమావేశాలలో చెప్పారనీ, తెలంగాణ ఆ ఘనత  సాధించడానికి   పునాది వేసింది చంద్రబాబేననీ నెటిజన్లు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిలదీస్తున్న, ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకాలనీ, స్వయంగా కేటీఆర్ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బహిరంగ ప్రకటన చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆందోళనలో  ప్రత్యక్షంగా పాల్గొనాలనీ, తద్వారా హైదరాబాద్ నేటి ఈ స్థితికి కారణమైన చద్రబాబుకు థాంక్స్ చెప్పాలనీ సూచిస్తున్నారు.  అయినా.. హైదరాబాద్ నగరం ట్విన్ సిటీస్ స్థాయి నుంచి ట్రిపుల్ సిటీ స్థాయికి ఎదిగిందంటే.. అదంతా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని నెటిజన్లు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.    

అయితే.. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలకు దిగితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి.. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు.. గతంలో చంద్రబాబు వల్లే.. ఇక్కడ ఇంత అభివృద్ధి జరిగిందనే ఓ ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకొందని.. ఆ నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయాలు.. రంగంలోకి దిగి సైబరాబాద్‌లో ఆందోళనలు, ధర్నాలు చేపట్ట వద్దంటూ.. పోలీసు ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని.. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేరు ఉద్యోగులు చేపడుతోన్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.