posted on Sep 25, 2023 4:52PM
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై మధ్య విభేధాలు ఇంకా సమసిపోలేదా? తాజా పరిణామాలు చూస్తుంటే గవర్నర్ తమిళ సై, కేసీర్ ప్రభుత్వం మధ్య ఇంకా కోల్డ్ వార్ మళ్లీ మొదలైందని తెలుస్తోంది.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. ఇటీవలె సచివాలయంలోని రెండు ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ రాజ్ భవన్ కు వెళ్లి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో మళ్లీ సఖ్యత కుదిరిందని అందరూ భావించారు. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు గవర్నర్ తో విభేధాలు అంత మంచిది కాదని కేసీఆర్ భావించడం వల్లే రాజీకి వచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎంఎల్ సీ పదవి ఇవ్వాలంటూ బిఆర్ ఎస్ అధిష్టానం చేసిన సిఫారసును గవర్నర్ తమిళ సై తిరస్కరించడంతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీటౌతుంది. అప్పుడు ఒక ఎంఎల్సి కౌషిక్ రెడ్డికి చేసిన సిఫారసును తిరస్కరిస్తే ఇప్పుడు ఇద్దరు ఎంఎల్సి అభ్యర్థులను గవర్నర్ తమిళ సై తిరస్కరించడం పెను సంచలనమైంది.
గవర్నర్ కోటాలో ఎంఎల్సీ నియామకం అంత ఆషామాషీ కాదు . సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన వారికి గవర్నర్ కోటాలో ఎంఎల్ సీ పదవి ఇవ్వడం సాంప్రదాయం. దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రస్తుతం యాక్టివ్ పొలిటిక్స్ లో ఉన్నారు. ఈ కారణంగానే వారి సిఫారసులను గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రకటించారు కూడా. వీరిద్దరి సామాజిక కార్యక్రమాలు పెద్దగా ఏమి లేవని గవర్నర్ వ్యాఖ్యానించారు.