పొన్నవోలు ముంచేశారు.. వైసీపీలో అంతర్మథనం? | ycp fully sunk in skill case| tdp| ponnavolu| Corruption|money| court| tdp| reveals| jagan| party
posted on Oct 9, 2023 10:20AM
జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేరిట తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో కోర్టులలో సమర్పిస్తున్న పత్రాలు, కేసులో చంద్రబాబు పాత్రను రుజువు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా జగన్ దుష్టపన్నాగాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
అంతే కాదు.. ఈ కేసు పుణ్యమా అని దేశంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వస్తున్నాయన్న రహస్యం కూడా వెలుగులోకి వచ్చింది. స్కిల్ కేసు అవినీతి సొమ్ము తెలుగుదేశం మళ్లిందంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చేసిన ఆరోపణ, అందుకు ఆధారంగా చూపిన వివరాలు బూమ్ రాంగ్ అయ్యాయి. పొన్నవోలు చేసిన ఆరోపణ, చూపిన ఆధారం వైసీపీ మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో వైసీపీలో గాభరా మొదలైంది. ఆ ఆరోపణతో వైసీపీతో పాటు, బీజేపీని కూడా పొన్నవోలు ఇరుకున పడేశారు. స్కిల్ కేసులో తెలుగుదేశం ఖాతాలోకి లంచం సొమ్ము 27 కోట్లు మళ్లాయంటూ పొన్నవోలు చేసిన ఆరోపణ వైసీపీ కాళ్ల కింద నేలను కదిలించివేస్తున్నది.
ఎన్నికల విరాళాల రూపంలో వచ్చిన నిధులను కోర్టుకు సమర్పించి దానికి అవినీతి సొమ్ముగా పేర్కొనడంపై తెలుగుదేశం తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు, అలాగే అందుకు సంబంధించి బ్యాంకు వివరాలను వెల్లడించిన తెలుగుదేశం, అదే సమయంలో వైసీపీకి వచ్చిన విరాళాల లెక్కల గుట్టు రట్టు చే సింది. వైసీపీ ఖాతాలకు ఏపీలో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఏ కంపెనీలు విరాళాలు జమచేశాయన్న సమాచారాన్నీ వివరంగా పేర్కొంది. పార్టీకి వచ్చిన విరాళాలను కూడా స్కిల్ స్కాంకు లింకు చేయడంపై దుమ్మెత్తి పోసింది. పార్టీకి వచ్చిన విరాళాలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి, ఎన్నికల సంఘానికి పంపిస్తామని పేర్కొన్న తెలుగుదేశం. స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. తాము ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను.. డౌన్ లోడ్ చేసుకుని దానినే కోర్టుకు సమర్పించి గోల్ మాల్ చేయడానికి ప్రయత్నించిన పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ చర్యలకు డిమాండ్ చేసింది.
మొత్తంగా స్కిల్ అవినీతి సొమ్ము అంటూ పొన్నవోలు కోర్టుకు సమర్పించిన వివరాల డొల్లతనం బయటపడటంతో పాటు.. వైసీపీకి అందిన వివరాల గుట్టుమట్లు కూడా బయటపడటంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆ పార్టీకి 600 కోట్ల రూపాయలు విరాళాలు అందాయన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది.ఆ సొమ్ము ఏపీలో కాంట్రాక్టులు చేసిన కంపెనీల నుంచి వసూలు చేసినదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ విరాళాలలో అధికభాగం ఏపీలో కాంట్రాక్టులు చేస్తున్న మేఘా, హెటిరో, వైకాపా ఎంపి ఎంవివి కంపెనీల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ విరాళాలలో పోలవరం కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ లో దక్కించుకున్న మేఘా కంపెనీ 22 కోట్ల రూపాయలు, కడప స్టీల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 14 కోట్ల రూపాయలు, అలాగే వివాదాస్పద భూములను దక్కించుకున్న హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయలు ఉన్నాయి.