posted on Oct 13, 2023 3:02PM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయిన ఆయన అన్నారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదని చెప్పారు. సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని అన్నారు. సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని చెప్పారు.
జనగామ టికెట్ ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నాల చాలా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో కూడా పొన్నాలకు చివరి నిమిషంలో టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా కోదండరామ్ కు జనగామ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరకు ఆయన టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన పొన్నాల… తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.
జనగామ టిక్కెట్టు విషయంలో బలమైన బీసీ నేతకు బదులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇవ్వాలనే నిర్ణయం సరైంది కాదని పొన్నాల లక్ష్మయ్య వాదిస్తున్నారు. కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టుగా కూడ ప్రచారం సాగుతుంది.
ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతానికి భిన్నంగా వ్యక్తిస్వామ్యం సాగుతుందని చెప్పారు.కొత్తగా వచ్చినవారికి పెద్దపీట, పాతవారి ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆ లేఖలో పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే బజార్లో గొడ్డును అమ్మినట్టుగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.