కృష్ణా జలాల పంపకంతో సీమాంద్రా సాగుకు సంకెళ్లు? | shackles to seemandhra cultivation| krishna| water| dispatch| jagan
posted on Oct 14, 2023 3:30PM
[30 లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారి]
రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పున:సమీక్షకు అంగీకారం తెలిపి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు కొత్త నిబంధనల పరిశీలనా బాధ్యత అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది. కృష్ణా జలాల పంపకం బాధ్యతను బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్కు అప్పగిస్తూ కొత్త విధి విధానాలను ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం సీమాంద్రా సాగుకు సంకెళ్లు వెయ్యడమే అవుతుంది. ఇది ప్రధానంగా రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సాగు నీటి రంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. బచావత్, బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునళ్లు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెరి సగం పంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వాదనకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుని ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను పాతరేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు అడుగడుగునా అన్యాయం చేస్తూనే వున్నది. ఒక పక్కన విభజన హామీలు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టగా, ఇప్పుడు తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు నీటి వాటాల పునఃసమీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు బీటలు బారుస్తుంది కేంద్రం. ప్రధానంగా ఇది రాయలసీమ సాగునీటి అవసరాల హక్కులను కాలరాయడమే అవుతుంది. కర్నాటక ఎన్నికలలో లబ్ధి పొందటానికి తుంగభద్ర డ్యామ్ పై భాగంలో నిర్మిస్తున్న ఎగువభద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించింది కేంద్రం . ఎగువభద్ర మొదటి రెండు దశల్లో 48 టీఎంసీల నీటిని తుంగభద్రకు రాక ముందే మళ్లిస్తున్నారు .కేంద్రప్రభుత్వ నిర్ణయం ద్వారా రాయలసీమ ప్రయోజనాలు పూర్తిగా ప్రమాదంలో పడినట్లేనని చెప్పాలి. ఈ దురాగతాన్ని, దుచ్ఛర్యను అడ్డుకోవల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
కేసులు నుండి బయటపడడం, అప్పులు చేయడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై చూపడం లేదు సియం జగన్ రెడ్డి. కృష్ణా జలాల కేటాయింపులపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్నిఎదిరించే ధైర్యం చెయ్య లేదు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ను కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై ప్రాజెక్టుల వారీ అధ్యయనంపై మార్గదర్శకాలనూ, నియమ నిబంధనలనూ వివరిస్తూ కేబినెట్ నోట్ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర నిర్ణయం అమలు చేస్తే రాష్ట్రానికి జరిగే నష్ట మేమిటో నిపుణులు అప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేబినెట్ నిర్ణయం తర్వాత 48 గంటలలోపే బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ను కొనసాగిస్తూ ప్రాజెక్టుల వారీగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులు నిర్వహించేలా గెజిట్ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోనే ఉన్నా కానీ కృష్ణా జలాలపై తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి జరిగే తీవ్ర నష్టాన్ని కేంద్రానికి గట్టిగా వివరించి కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చెయ్యలేకపోయారు.
ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నా గట్టిగా మాట్లాడకుండా మొక్కుబడిగా లేఖ రాసి జగన్ రెడ్డి చేతులు దులుపు కోవడం అంటే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల పై ఎంత ప్రేమ వున్నదో ప్రజలే అర్ధం చేసుకోవాలి . శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ కరువు ప్రాంతమైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని అపెక్స్ కౌన్సిల్లో సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల పరిధిలోనే వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో సగం వాటా కావాలన్న కేసీఆర్ డిమాండ్పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏపీ, తెలంగాణ మధ్య 811 టీఎంసీలలో 512, 299 టీఎంసీల వాటా మాత్రమే ఉందంటూ బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావాల్సిందేనని పట్టు బట్టనూ లేదు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను కలిపి కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఎలా వేస్తారంటూ జగన్ అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. ట్రైబ్యునల్ వేయడం వల్ల ఎదురయ్యే సమస్యలనూ ప్రస్తావించలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకే కేటాయింపులు పరిమితం చేయాలన్న కేసీఆర్ వాదనకూ జగన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నెల 4వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్లో కొత్త ట్రైబ్యునల్ వేయాలన్న కేసీఆర్ డిమాండ్ మేరకు బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్కు తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపకాల బాధ్యతను అప్పగించామని కేబినెట్ నోట్లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఆ రోజు అపెక్స్లో కేసీఆర్ను నిలువరించి.కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన గెజిట్ రాష్ట్రానికి గొడ్డలి వేటేనని కేంద్రం ఇచ్చిన గెజిట్ అమలైతే మొత్తంగా 30 లక్షల ఎకరాలకు శాశ్వతంగా చుక్కనీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు. అనేక ఏళ్లుగా వాడు కుంటున్న హక్కు పున:సమీక్షకు సిద్ధం కావడం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే. తెలంగాణలో చట్ట విరుద్ధంగా 299 టీఎంసీల నిలువతో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించి, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనివల్ల దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సాగుకు సంకెళ్లు పడనున్నాయి. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లేక ఎడారిగా మారే ప్రమాదముంది. 2014 పునర్విభజన చట్టంలో ఆమోదించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు పంగనామాలు పెడుతూ తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి బరితెగించింది. దీనికి కారణం తన కేసుల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి జగన్ లొంగిపోయి చివరికి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలుగుతుందన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి రాజకీయ ప్రయోజనం పొందడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాలన్నిటినీ సమ దృష్టితో చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న దుష్ట తలంపుతో వ్యవహరిస్తున్నది. కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో అనుమతు ల్లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ సక్రమం కానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కొత్తదని ఇప్పటికే బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ చెప్పింది. ట్రైభ్యునల్ దానికి నీటి కేటాయింపులు జరిపితే ఆంధ్రప్రదేశ్కే తీవ్ర నష్టం వాటిల్లనున్నది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి, బచావత్ ట్రిభ్యునల్ ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ ఏకపక్షంగా కృష్ణాజలాలు పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకోవడం అసంబద్దమైనదేకాదు రాజ్యాంగ వ్యతిరేకం కూడా. కృష్ణా జలాల్లో పంపకానికి కేంద్రం నిర్ణయం తీసుకొంటే జగన్ ఎందుకు మాట్లాడరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు .జగన్ తెలంగాణలో వున్న తన ఆస్తులు కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 90 టియంసిలు నీటిని తోడుకొనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదు. కేసీఆర్ నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలులోనికి వస్తే తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు ఉరి బిగించబోతుందన్నఆలోచన చెయ్యకుండా, 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేయ్యకుండా జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కృష్ణా జలాల అంశంలో సీఎం జగన్ రెడ్డి బాధ్యత లేకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సారథ్యంలో 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే జగన్ అభ్యంతరం చెప్పక పోవడంతో జగన్ రెడ్డి మెతక వైఖరిని ఆసరాగా తీసుకొని కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెరి సగం నీటి వాటాను డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోరుమెదపలేదు. జగన్ సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం అనుమతు ల్లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినా మౌనంగా వున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చినా ఎన్జీటీ స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. స్టే ఉత్తర్వుల ఎత్తివేత దిశగా జగన్ రెడ్డి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ అవార్డును ఇంతవరకు నోటిఫై చేయని ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను మళ్లీ అదే ట్రైబ్యునల్కు కేంద్రం కట్టబెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే. బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా. జలాల పంపిణీ బాధ్యతను కూడా కొత్తగా దానికెలా అప్పగిస్తారు? కేంద్ర నిర్ణయం ప్రధానంగా రాయలసీమకు శరాఘాతం కానున్నది. రాష్ట్రానికి శరాఘాతం లాంటి నిర్ణయాలను కేంద్రం తీసుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి?
ఇంత జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాలకు పెనుప్రమాదం ముంచుకు వచ్చినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణం. రాయల సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పంపకం జరిగితే శ్రీశైలం కుడి కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో గోరుకల్లు 10 టీఎంసీలు, అవుకు3 టేఎంసీలు, వెలిగోడు జలాశయం 16 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17టీఎంసీలు, ఎస్ ఆర్ -11.8 టీఎంసీలు, ఎస్ ఆర్ 22.27 టీఎంసీలు. కడప జిల్లాలో గండికోట 26 టీఎంసీలు, చిత్రావతి, మైలవరం, పైడిపాలెం, వంటి రిజర్వాయర్లకు చుక్క నీరు రాదు. ఈ రిజర్వాయర్లకు నీరు రాకపోతే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయకట్టు ఎడారిగా మారనున్నది. దీని ద్వారా జరిగే నష్టం 8 లక్షల ఎకరాలు బీడు భూములు మారనుంది. రాయలసీమ వాసులకు గుక్కెడు మంచినీరు దొరకడం కుడా కష్టం మారనుంది.తన కేసుల కోసం కేంద్రానికి సాగిల పడి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేసిన పాపాన్ని ప్రజలు ప్రశ్నించాలి.
నీరుకొండ ప్రసాద్