posted on Oct 14, 2023 12:41PM
తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడటంతో విద్యార్థుల్లో నిరాశ, నిసృహలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రవళిక అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీఎస్ సీ చైర్మెన్ జనార్థన్ రెడ్డి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం కొత్తేం కాదు. వరుసగా రెండు పర్యాయాలు వాయిదా పడటంతో విద్యార్థుల్లో అసహనం పెల్లుబికుతోంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడానికి అసెంబ్లీ ఎన్నికలు కెసీఆర్ ప్రభుత్వానికి సాకుగా మారాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సాకుగా చూపించి టీపీఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు లీక్ అయినట్టు కెసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేయలేని ప్రవీణ్ అనే వ్యక్తి ఏకంగా 103 మార్కులు తెచ్చుకోవడం పలు అనుమానాలకు తావించింది. ప్రవీణ్ అనే వ్యక్తి పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగి. ఒఎంఆర్ షీట్ నెంబర్ రాయకుండా జవాబులు ఠక ఠకా రాయడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. నిరుడు అక్టోబర్ నెలలో గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయి. రాజకీయ జోక్యంతో ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్టు చెబుతున్నారు. మంత్రి కెటీఆర్ జోక్యంతో ప్రశ్నా పత్రం లీక్ అయినట్లు ఆరోపణలున్నాయి. పోస్ట్ లు అమ్ముకోవడం వల్లే ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు దొరికాయి. గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ కావడానికి చాలామంది చిక్కడపల్లి గ్రంధాలయానికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. ప్రవళిక కూడా చిక్కడపల్లిలో ఉంటోంది. హైదరాబాద్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి మృతి అర్థరాత్రి కలకలం రేగింది. పరీక్ష వాయిదా పడటం వల్లే ఆమె మృతి చెందిందని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని భీష్మించారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఓ హాస్టల్లో ఉంటూ కాంపిటేషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనితోటి అభ్యర్థులు, అక్కడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. స్థానికులు, హాస్టల్ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. భారీగా చేరుకున్న అభ్యర్థులు పోలీసులు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులు అడ్డుకోవడంతో అర్థరాత్రి వరకు హాస్టల్లోనే మృతదేహం ఉండిపోయింది. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి నిరసనల్లో పాల్గొన్నారు. రాత్రి రెండు గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రూప్స్ అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులతో పోలీసులు మాట్లాడుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టారు. ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇలా టెన్షన్ వాతావరణంలోనే ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవళిక పేరు మీద ఓ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అమ్మా నన్ను క్షమించండీ అంటూ మొదలు పెట్టిన లేఖలో చాలా అంశాలు ప్రస్తావించింది. తాను నష్టజాతకురాలిని అని తన వల్ల పేరెంట్స్కు ెప్పుడూ బాధలే అని చెప్పుకొచ్చింది. మీకు నేను చాలా అన్యాయం చేశానని ఎవరూ ఏడవొద్దని చెప్పిన ప్రవళిక..తన కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు చెప్పింది. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నాననని క్షమించాలని కోరుతూ లేఖ ముగించింది.
ఉదయాన్నే ప్రవళిక బంధువులు హైదరాబాద్ వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని చూసిన తల్లి కుప్పకూలిపోయారు. మెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని తలెత్తుకొని వస్తుందని అనుకుంటే ఇలా విగత జీవిగా పడి ఉండటం చూసి బంధువులు కూడా తట్టుకోలేకపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, భాషా పండిట్లు, ఎస్జీటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్జీటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.