posted on Nov 3, 2023 11:28AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అయింది.రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీ చేసారు. దీంతో నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 10తో ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది.
అభ్యర్థులు ఈసారి తమ నేరాలను దాచే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. వాటిని స్పష్టంగా పేర్కొనాలంటూ ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు, వాటిని మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైలులో కనుక ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మొత్తం 3.17 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబరు 3న ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం 119 స్థానాలకు గాను అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 100, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.