posted on Nov 6, 2023 2:36PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సోమవారం (నవంబర్ 6) దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఎర్రవల్లికి మళ్లించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా వరుసగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభలు రోజు రెండు, మూడు నిర్వహిస్తున్నారు. దాంతో.. హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనల్లో బిజీ అవుతున్నారు. అయితే.. తాజాగా సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఇవాళ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో బయల్దేరారు సీఎం కేసీఆర్. చాపర్ టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. వెంటనే అప్రమత్తం అయ్యి.. హెలికాపప్టర్ ను సురక్షితంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా దించారు. సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో హెలికాఫ్టర్ ను సిద్ధం చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.