Leading News Portal in Telugu

రికార్డులను తిరగరాయనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఎందులోనంటే..? | new records to be created in ts assembly elections| expenditure| constituencies| candidates| parties| sky


posted on Nov 7, 2023 1:45PM

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రికార్డు మెజారిటీలలోనో, జయాపజయాలలోనో కాదు.. మెజారిటీ స్థానాలు, మెజారిటీ ఓట్ల విషయంలోనూ కాదు.. పోలింగ్ శాతం విషయంలోనూ కాదు. ఓటరు చైతన్యం విషయంలో  అస్సలు కాదు.  మరి దేంట్లో అంటే ఎన్నికల వ్యయం విషయంలో. ఔను ఎన్నికల వ్యయంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ తిరగరాస్తాయని పరిశీలకులు, రాజకీయ పార్టీలే కాదు.. సామాన్య ప్రజలకు కూడా అంటున్నారు.

ఉప ఎన్నికల విషయంలోనే రికార్డులను తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డును సృష్టించకపోతేనే ఆశ్చర్యం  అని  అంటున్నారు. ఉప ఎన్నికలలో ధన ప్రవాహాన్ని చూసిన  జనం అప్పట్లో తమతమ నియోజకవర్గాలలో కూడా  ఉప ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఉప ఎన్నిక కోసం తమ నియోజకవర్గ ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని జనం డిమాండ్ చేయడం బహుశా అంతకు దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరిగి ఉండదు.  అటువంటిది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ ఒకే సారి ఎన్నికలు జరుగుతుంటే.. ధన ప్రవాహం విషయంలో గత రికార్డులు తుడిచిపెట్టుకు పోవడం ఖామయని అంటున్నారు.   2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.  ఎన్నికల ఖర్చు విషయంలో  ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.   తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది. 

హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు కానీ.. అయిన ఖర్చు మాత్రం  చెప్పలేము. తక్కువలో తక్కువ   వెయ్యి కోట్ల పైమాటగానే అప్పట్లో చెప్పుకున్నారు. కానీ శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలల్లో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని  అధికారిక గణాంకాలే  తేల్చి చెప్పాయి. 

ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల రూపాయల   గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి.  అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో సామాన్య జనమే నెలల తరబడి చెప్పుకున్నారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కోట్లలో సోమ్ము కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.  హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే,  అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన  కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు  అప్పట్లో తెరాస నాయకులను బహిరంగంగా నిలదీశారు. ధర్నాలు చేశారు. అదీ  హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో  సృష్టించిన చరిత్ర. వాస్తవానికి  హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత  రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు.  అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.  ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది.  అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో  ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి.   మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది.  అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.  ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఎంత తక్కువగా చూసుకున్నా వంద కోట్లకు పైమాటేనని అంటున్నారు. వాస్తవంగా ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు.  కానీ అనధికారికంగా అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేస్తున్నారన్నది, చేస్తా రన్నది బహిరంగ రహస్యమే.  ఇప్పటికే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచీ కోట్లలో పట్టుబడుతున్న నగదే.. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో ధన ప్రభావం అంతులేకుండా ఉంటుందన్నడానికి  ఉదాహరణగా చెబుతున్నారు.