ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిమ్మగడ్డ పిటిషన్ | nimmagadda pil in supreme| ap| voters| list| citizens| for
posted on Nov 8, 2023 9:26AM
ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎంత అడ్డగోలుగా ఉందో అంతకు మించి ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న జగన్ సర్కార్ వారి ద్వారా ప్రజల పర్సనల్ డేటాను సేకరించడంతో పాటు.. తమకు వ్యతిరేకులు ఎవరన్నది గుర్తించి వారి ఓట్ల తొలగింపు.. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల చేర్పే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
పయ్యావుల వంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల పుణ్యమా అని ఓటర్ల జాబితాలో అక్రమాలు వాస్తవమేనని తెలింది. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. అయితే నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఫిర్యాదులు చేసిన కేంద్రఎన్నికల సంఘం కొరడా ఝుళిపించినా.. లెక్కేమిటన్న చందంగా జగన్ సర్కార్ అదికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ ఓట్ల నమోదు.. ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో దొంగ ఓట్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అన్న సంస్థను స్థాపించి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి మరీ ఓటు హక్కు పొందారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఓటు నమోదు చేయకతప్పని పరిస్థితిని ఎన్నికల సంఘం ఎదుర్కొంది.
ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయపోరాటానికి దిగారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్ అనడంతో విచారణ వాయిదా పడింది.
ఏపీలో ఓటర్ల జాబితాలన్నీ పూర్తిగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా జరుగుతున్నాయనీ, వీరంతా వైసీపీ కార్యకర్తలేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉందనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని నిమ్మగడ్డ ఆరోపించారు. ఓటర్ల జాబితాల అక్రమాల కోసం రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని కూడా నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీజేఐ ఆదేశాలతో పిటిషన్ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అక్రమాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టీ పడేలా చేయడంలో నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ అయ్యారు.