Leading News Portal in Telugu

తెలుగు దేశం, జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు! ra


posted on Nov 8, 2023 11:20AM

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. టిడిపి, జన సేన ఎన్నికల పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటులో నరసాపురం ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు అనే విషయం తేలకుండానే రఘురామ కృష్ణరాజు ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. 

రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై రఘురామరాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి జగన్ స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడని, తన తండ్రి వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి… పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం… రూ. 5,300 కోట్లను నిలిపివేసిందని రఘురామరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని… అలా కాకుండా ఏదో తన స్వంత జేబు నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, ఆయన తండ్రి ఫొటో వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.