విశాఖపట్నంలో స్కూల్ ఆటోను ఢీ కొట్టిన లారీ…ఏడుగురు చిన్నారులకు గాయాలు | another road accident in vishaka
posted on Nov 22, 2023 11:35AM
విశాఖపట్నంలో బుధవారం ఉదయం ఆటో లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటోను ఓ ట్రక్కు వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయాలపాలైన చిన్నారులు బేతని స్కూలు విద్యార్థులని పోలీసులు తెలిపారు.విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు, స్కూలు పిల్లల ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో రెండు పల్టీలు కొట్టింది. దీంతో స్కూలు పిల్లలు ఎగిరి బయటపడ్డారు. వెంటనే చిన్నారులను స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.