Leading News Portal in Telugu

పరుచూరులో వైసీపీ అరాచకం.. మాట వినని అధికారులపై సస్పెన్షన్ వేటు! | ycp anarchy in paruchuru| votes| delete| officers| suspend| amanchi| eluri


posted on Nov 27, 2023 1:35PM

ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కుట్రపూరితంగా జరుగుతున్నదని ప్రతిపక్ష  తెలుగుదేశం చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా  తెలుగుదేశం సానుభూపతి పరుల ఓట్లను తొలగిస్తున్నదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన ఈసీ ఇద్దరు అధికారులపై కూడా వేటు వేసింది. అయినా.. ఈ ప్రక్రియ ఆగలేదని, ప్రతి నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకోసం అధికారులపై వైసీపీ నేతలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, పలు చోట్ల అధికారులు ఈ ఒత్తిడి తట్టుకోలేక  సెలవు పై వెళ్లిపోతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. కాగా ఈ వ్యవహారంలో అసలు వైసీపీ నేతల మాట వినని అధికారులను సస్పెండ్ చేయించేందుకు కూడా వెనకాడడం లేదట.  వైసీపీ నేతల మాట విని అక్రమంగా వ్యవహరిస్తే రేపు న్యాయస్థానాలలో  చిక్కులు తప్పవనే భయంతో అధికారులు కొందరు అక్రమంగా ఓట్ల తొలగింపునకు, దొంగ ఓట్ల నమోదుకు నిరాకరిస్తున్నారు. దీంతో అలాంటి వారిని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు వారిపై సస్పెన్షన్ వేటు పడేలా చేస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో  రాష్ట్రంలో అధికారుల పరిస్థితి విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది.

ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా ఓట‌ర్ల ముసాయిదా జాబితాల్లో స‌వ‌ర‌ణ‌ల ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. డిసెంబ‌రు 15 నాటికి తుది జాబితా వెలువ‌డ‌నుంది. దీంతో స‌ద‌రు జాబితాలపై అధికార పార్టీ నాయ‌కులు క‌స‌ర‌త్తు ముమ్మరం చేయ‌డం వివాదాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా   ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందనీ,  ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగింపు లక్ష్యంగా ఇది కొనసాగుతోందని. ఇప్పటికే ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా.. అధికారులు భయంతో వణికిపోతున్నారనీ అంటున్నారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఈ ఓట్ల తొలగింపు ముమ్మరం చేసిందంటున్నారు. ఇందుకోసం ఎక్కడిక్కడ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఓ ప్లాన్ ప్రకారం వ్యవహారం నడిపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలా వైసీపీ ఓట్ల తొలగింపు ముమ్మరంగా జరుగుతున్న నియోజకవర్గాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం నుండి ఏలూరి సాంబశివరావు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. పరుచూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడంలో సందేహం లేదు. రానున్న ఎన్నికలలో కూడా ఏలూరి ఇక్కడ నల్లేరు మీద నడకేనన్న భావన ఉంది.  గత ఎన్నికల తర్వాత ఏలూరిని వైసీపీలోకి రావాల్సిందిగా అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి చేసింది. అయితే ఏలూరి మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకుని  నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీని వీడలేదు.  మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రిది కూడా ఇదే నియోజకవర్గం. ఆమె ఇక్కడ పోటీ చేయకపోయినా ఆమెకు సొంత బలం ఉంది. ఈ ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొట్టాలంటే వైసీపీ ఇక్కడ గెలవాలన్నది టార్గెట్. దీని కోసమే ఇక్కడ వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుంది.

ఇప్పటికే ఇక్కడ వైసీపీ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను రంగంలోకి దింపింది. తెలుగుదేశం టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాంకు చీరాల టికెట్ హామీతో ఆమంచిని అక్కడ నుండి పరుచూరుకు తరలించింది. ఈ క్రమంలోనే ఆమంచి ఏది అడిగినా అధిష్టానం కాదనకుండా  ఇస్తూ స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.  అయితే, ఈ వ్యవహారంలో  ఆమంచి మాట వినడం లేదని కొందరు తహసీల్దార్లపై పలు రకరకాల సాకులుతో సస్పెన్షన్ వేటు పడిందని అంటున్నారు.  మరో మండలంలో ఓ అధికారి ముందే బదిలీపై వెళ్లిపోగా..  ఇప్పుడు ఇక్కడకు కొత్తగా బదిలీపై వచ్చేందుకు అధికారులు ససేమీరా అంటున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులను అధికార పార్టీ ఏరి కోరి తెచ్చుకుందని తెలుగుదేశం ఆరోపిస్తోంది.  దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది.