Leading News Portal in Telugu

రాయదుర్గం- శంషాబాద్ మెట్రోపనుల నిలిపివేత | rayadurgam


posted on Dec 14, 2023 9:57AM

మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గం-ఎయిర్‌‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను సీఎం ఆరా తీశారు.  ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్నందున రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం పనుల టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. చాంద్రాయాణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం రూట్‌తో పాటూ చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఈ రూట్లతో తూర్పు, మధ్య, పాతబస్తీ వాసులకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-శంషాబాద్‌ ప్లాన్‌కు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి బదులుగా ఓల్డ్‌ సిటీని అనుసంధానిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జెబిఎస్ -ఫలక్‌నుమా కారిడార్‌ పూర్తి చేసి పహాడీ షరీఫ్‌ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లక్డీకపూల్‌, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మరో లైన్‌ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ ప్లాన్‌లో ఓల్డ్‌ సిటీలోని మెజార్టీ ప్రాంతాలతో పాటు టెక్‌ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.హైదరాబాద్‌ అభివృద్ధిపై వారితో చర్చించారు. ఐటీ కారిడార్‌, శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు, వారి బంధువులకు ఎక్కువగా ఏ రూట్‌ ఉపయోగపడుతుందో చూడాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ విధానంలో నిర్మించేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.7 వేల కోట్లు ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా.. ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టును దక్కించుకుంది.