Leading News Portal in Telugu

కస్తూర్భా  టీచర్లను ఉద్యోగాల నుండీ తొలగించిన ఏపీ ప్రభుత్వం


posted on Jan 6, 2024 2:49PM

ఎపిలో అంగన్ వాడీ కార్మికులపై ఎస్మా ఉక్కుపాదంతో అణిచి వేసిన జగన్ సర్కార్  అదే రోజు కస్తూర్బా ఉపాధ్యాయులను ఏకంగా  విధుల నుంచి తొలగించింది. దీంతో ఉపాధ్యాయులు  ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. 

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ)లో పని చేసే ఉపాధ్యాయులను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీచేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సమ్మెకు దిగడంతో వారిపై సర్కారు కన్నెర్రజేసింది. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ తొలగించాలని ఆదేశాలు జారీచే నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కేజీబీవీ టీచర్లను వెంటనే విధుల్లో చేరాలని సూచించాలని, చేరని వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని జిల్లాల అధికారులకు సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు అమలుచేస్తే ఒకేసారి దాదాపు వెయ్యి మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకటి రెండు రోజుల్లో తొలగింపు ఉత్తర్వులు జారీ చేసేందుకు జిల్లాల్లో అధికారులు సన్నద్ధమవుతున్నారు.అయితే ప్రభుత్వం ఎన్నిబెదిరింపులకు దిగినా సమ్మె విరమించేది లేదని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయాన్ని ముట్టడిస్తామని జేఏసీ చైర్మన్ కాంతారావు తెలిపారు. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, లేనిపక్షంలో మినిమం టైమ్ స్కేలయినా అమలుకు డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబరు 20 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.