Leading News Portal in Telugu

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిత్వానికి బండ్ల గణేష్ దరఖాస్తు 


posted on Feb 2, 2024 1:50PM

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. త్వరలో  ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్‌లో పన్నెండు  స్థానాలు గెలవాలని కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ యోచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని పలువురు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని బండ్ల గణేశ్ చెప్పారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేశ్ తీవ్రంగా మండిపడ్డారు. మల్లారెడ్డికి మతిభ్రమించినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పీల్చిపిప్పి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద లోకసభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. బిజెపి నుంచి రాంచందర్ రావు పోటీలో ఉన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలుపొందారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో మల్కాజ్ గిరి కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా  కాంగ్రెస్ లో స్థబ్దుగా ఉన్న బండ్ల గణేష్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ కాంగ్రెస్ వేవ్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  దీంతో  కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలు ఒక్కొక్కరు  దగ్గరవుతున్నారు. లోకసభ ఎన్నికల వేళ మరింత క్రియాశీలకమవుతున్నారు.