Leading News Portal in Telugu

దోపిడీ సొమ్ము నుంచి చిల్లర పంచితే ఓట్లు రాల్తాయా? | ycp insulting voters by distributing money| political| business| extortion| ravin


posted on Feb 28, 2024 8:42AM

జగన్ హయాంలో ఏపీలో పాలన అంటే అధికార పార్టీ దోపిడీగా మారిపోయింది. అధికారంలో ఉన్నంత కాలం వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా  దోచుకున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అసలు జగన్ పాలనను అంతం చేయడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.  ప్రజాగ్రహం వైసీపీ నేతలు గ్రహించినా, ఎన్నికల ముందు తాము దోచుకున్న సోమ్ముల నుంచి కొంత చిల్లర పారేస్తే ఓట్లు అవే రాలుతాయన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పుడే నియోజకవర్గాలలో సొమ్ముల పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించేశారు. అధికార పార్టీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికల షెడ్యూలే ఇంకా విడుదల కాలేదు. అప్పుడే సొమ్ముల పంపిణీ మొదలు పెట్టేశారు. ఓట్ల కొనుగోలు కోసం దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు బహిరంగంగా బరి తెగించి మరీ సోమ్ములు, మద్యం పంపిణీ చేస్తున్నారు.  టిక్కెట్లపై క్లారిటీ లేని చోట కూడా ఈ పంపిణీ కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందంటే వైసీపీ నేతలు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతగా దోచుకున్నారో అవగతమౌతోంది.  కాగా ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నియోజకవర్గాలలో అయితే  పోటీలో నిలబడే  అభ్యర్థులే స్వయంగా రంగంలోకి.. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకుని మరీ కానుకల పందేరాన్ని ప్రారంభించేశారు.  చీరలు, వాచీలు, ప్యాంట్ షర్టులు, కుక్కర్లు బరితెగించేసి మరీ ఇంటింటికీ కానుకలు పంపిణీ చేస్తున్నారు.  వాలంటీర్లకు..సచివాలయ సిబ్బందికి పెద్ద ఎత్తున కానుకలు ఇవ్వగా, ఇప్పుడు ఓటర్ల పంచుతున్నారు. ఇందు కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ. కోట్లు పంచుతున్నారు. ఈ పంపిణీ ఏమీ రహస్యంగా జరగడం లేదు. బహిరంగంగా బాహాటంగా ఓటర్లను కొనేస్తున్నాం అని చాటుకునే విధంగా వైసీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.   అయితే ఈ ఐదేళ్ల కాలంలో వారు దోచుకున్న దానితో పోలిస్తే.. ఇప్పుడు పంపిణీ చేస్తున్నది చిల్లర కాసులతో సమానమని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టారీతిన దోచుకుని ఇప్పుడు.. మళ్లీ అధికారం కోసం సొమ్ముల పందేరానికి తెగబడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం కనుసన్నలలోనే ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఎంత మందికి  కానుకలు పంపిణీ చేశారన్న వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి అందే విధంగా పకడ్బందీ ఏర్పాటు చేశారని అంటున్నారు.  

పార్వతీపురంలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు అయితే రెండు చేతులా ఈ పంపిణీని బాహాటంగా నిస్సిగ్గుగా బరి తెగించి మరీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఓ చేత్తో జేబులో నుంచి నోటు, మరో చేత్తో చీరా పంచేస్తున్నారు.   ఏకంగా షామియానా వేసి మరీ ఈ పంపిణీ సాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా ఇష్టారాజ్యంగా దోచుకున్న వైసీపీ.. కనీసం రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదు. కానీ ఎన్నికల సమయం వచ్చే సరికి జనాలకు తాయిలాల్లా, పప్పుబెల్లాళ్లీ చిల్లర పంచేస్తే ఓట్లు అవేపడిపోతాయన్న అహంభావంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ నేతల అహంకారంపై ఓటుతో చావుదెబ్బ కొట్టాల్సిన బాధ్యత ప్రజలదే.