posted on Mar 11, 2024 12:43PM
ఎపిలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. టిడిపి, బిజెపి, జనసేన పొత్తు ఖరారైన తర్వాత ఈ వేగం మరింత ఎక్కువైంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేశ్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున దుర్గేశ్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది.
ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. మరోవైపు బీజేపీ, జనసేనలకు పొత్తులో భాగంగా 8 లోక్ సభ, 30 శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది.