posted on Mar 13, 2024 10:41AM
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో పార్టీలు ఓటర్లను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల ముంగిట పార్టీలన్నీ ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రతిపక్ష తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు ఎత్తుగడతో షెడ్యూల్కు ముందే మ్యాజిక్ ఫిగర్ అందుకుని టీడీపీ కూటమి విజయం వైపు పరుగులు పెడుతోంది.
ఏపీ ఎన్నికల ముఖచిత్రం చూస్తే తెలుగుదేశం దూకుడు మామూలుగా లేదని తేటతెల్లమౌతోంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు వ్యూహాత్మకంగా వెళ్ళుతూ గెలుపు దిశగా పరుగులు పెడుతోంది. గతానికి భిన్నంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు అందరినీ కలుపుకునిపోతున్నారు. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ కూటమి అడుగులు ధృఢంగా పడ్డాయని చెప్పవచ్చు.
తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నది.
భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది.
జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.
బిజెపి ప్రభావం = (6 x 7) 42 + 10 = 52
జనసేన ప్రభావం (2 x 7) 14 + 21 = 35 = 87
మ్యాజిక్ ఫిగర్ 88 దాదాపుగా రీచ్ అయినట్లే… అంటే టీడీపీ గెలుపు అనేది ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎంత మెజార్టీ అనేదే తెలాల్సి వుంది.
టీడీపీ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకోబోతోందనేది తేలిపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం చేశారు. అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ వైపు మళ్లింది. అయితే వైసీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపునకు తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహలు రచిస్తున్నది. కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగితే వైసీపీకి భారీగా నష్టం వాటిల్లుతుంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది. ఈసారి రాయలసీమలో జగన్ ను దెబ్బకొట్టి కనీసం ముప్పయి స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.
గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురరంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి మాత్రమే టీడీపీ విజయం సాధించింది.
కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచి జగన్ ను దెబ్బతీయాలన్న ప్లాన్ లో తెలుగుదేశం ఉంది. నాలుగు జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈసారి తెలుగుదేశం అధిక స్థానాలను సాధించేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తెలుగుదేశంకు కంచుకోట. అక్కడ వైసీపీని సులువుగానే దెబ్బతీయవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటూ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన పనిలేదు. ఆ పనిని తన పార్ట్నర్ పవన్ కల్యాణ్ చూసుకుంటారు.
ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పది నుంచి పదిహేను స్థానాలకు పైగా సాధిస్తే అధికారం చేతుల్లోకి వచ్చి పడినట్లే. అందుకోసమే ఆయన గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అక్కడ ఎక్కువ నిధులను కుమ్మరించేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇటు కులాల వారీగా, ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగారు.
1999లో బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. సక్సెస్ అయ్యింది. 2004లో మాత్రం పొత్తు పెట్టుకుని ఓడిపోయింది. 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అప్పుడు కూడా ఓటమి ఎదురైంది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుంది. గెలుపు సాధించింది. అయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే సమయంలో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగినప్పుడు మాత్రం ఆ పార్టీ గెలుపు బాట పట్టింది. లేనప్పుడు ఓటమి ఎదురైంది. 2009లో ఉమ్మడి ఏపీలో టిడిపి మహాకూటమితో కాంగ్రెస్ ను ఢీ కొట్టింది. టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ ఓటు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
అంటే ఓట్ల బదలాయింపు జరగలేదు. టిడిపి సీట్ల పరంగా మెరుగుపడినా.. భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్ల బదలాయింపు జరగక అధికారాన్ని అందుకోలేకపోయింది. 2004లో 47 స్థానాలతో ఉన్న టిడిపి 2009 నాటికి 92 స్థానాలకు చేరుకుంది. కానీ 2004లో 37.59% ఉన్న టిడిపి ఓటు బ్యాంక్ 2009 నాటికి 28.12 కు పడిపోయింది. భాగస్వామ్య పక్షాల నుంచి ఓట్ల బదలాయింపు జరగకపోవడమే ఇందుకు కారణం. నాడు ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగి ఉంటే టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేది. దీంతో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల బదలాయింపు చంద్రబాబు దృష్టి పెట్టారు. 2009 ఎన్నికల గుణపాఠంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు విడిచిపెట్టడం లేదు.