posted on Aug 20, 2024 11:20AM
జమ్మూ కాశ్మీర్ లో భూమి కంపించింది. కాశ్మీర్ లోయలో స్వల్ప వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో జనం భయకంపితులయ్యారు. మంగళవారం (ఆగస్టు 20) ఉదయం రెండు దఫాలుగా భూమి కంపించింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉదయం 6.45 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఆ తరువాత మరి కొద్ది సేపటికే భూమి మరోసారి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
కాగా ఈ భూకంప కేంద్రం ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఉంది. కాగా పొరుగుదేశమైన పాకిస్థాన్ లోనూ భూమి కంపించింది. అక్కడ కూడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ లో నెల రోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది రెండో సారి. అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.