Leading News Portal in Telugu

ఆర్ఆర్ఆర్ కేసులో పోలీసు స్టేషన్ కు జగన్?! | guntur police to send notice to jagan| attend inquiry| rrr| custodial


posted on Aug 30, 2024 6:18PM

రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కనున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా  ఈ కేసులో నిందితులకు నోటీసులు పంపించేందుకు సమాయత్తమౌతున్నారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు సహా మరికొందరిని పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ కేసుకు సంబంధించి విచారణాధికారుల ఇప్పటికే అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీకీ విజయ్ పాల్ కు నోటీసు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. 

అప్పటికి నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరుపై, జగన్ విధానాలపై విమర్శలు గుప్పించడంతో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడీ పోలీసులు రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను  కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు  ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయనున్నారు.  కాగా ఈ కేసులో జగన్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులను అందుకుని జగన్ పోలీసు స్టేషన్ కు వస్తారా లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.