దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలు.. దావోస్ లో చంద్రబాబు బిజీబిజీ | cbn busy in davos| series| of| meetings| with|legendary
posted on Jan 21, 2025 11:10AM
దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలతో ఆయన బిజీబిజీగా ఉన్నారు. వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరితో వరుస సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ (జనవరి 21) వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి, భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు – రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్తోనూ ఆయన మంగళవారం (జనవరి 21) భేటీ అవుతారు. బ్లూమ్బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు.
కాగా మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్ , టీజీ భరత్ మంగళవారం (జనవరి 21) సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం కుదిరిన విషయం తెలిసింద. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
కాగా సోమవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్పై చర్చించారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటు చేసిన నెట్ వర్కింగ్ డిన్నర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు.