Leading News Portal in Telugu

దావోస్ లో ముగిసిన బాబు పర్యటన.. విజయవంతంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్ | cbn davos tour concluded| successful| pramoting| brand| andhra| pradesh| four| days


posted on Jan 23, 2025 4:51PM

ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నాలుగు రోజులు పాటు దావోస్ లో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు పర్యటన ముగిసింది. గురువారం (జనవరి 23) సాయంత్రం ఆయన దావోస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా సాగిన చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయ్యింది.  ఈ నాలుగు రోజులూ ఆయన   ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో  భేటీలు జరుపుతూనే.. మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో  పాల్గొని ఆంధ్రప్రదేశ్‌  బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. 

దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో  చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం మరో రోజు అదనంగా దావోస్ లో గడుపుతారు. మరి కొందరు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ కానున్నారు.  

  జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్‌ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించడంతో తొలి రోజు పర్యటనను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు.  

ఇక రెండో రోజు రెండో రోజు   భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ప్రసంగించిన చంద్రబాబు ప్రసంగించారు.   2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను  వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయనున్న  గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్  జీఎల్సీ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.  

ఇక మూడో రోజు   గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో భేటీ అయ్యారు.  ఆ సంస్థ  విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.  గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్‌ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు చంద్రబాబు  సూచించారు. అలాగే  చమురు, సహజవాయువు కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, సీఈవో  ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.    గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది.  పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ భాగస్వామి కావాలని ముహమ్మద్ తౌఫిక్‌ను చంద్రబాబు కోరారు.  ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో నూ చంద్రబాబు భేటీ అయ్యారు.   విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అదే రోజు బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై వివరించారు. 

 ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల హబ్ గా ఏపీని  మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, అలాగే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సూచనలు చేయాలని కోరారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు ఆయనను కోరారు. అలాగే హిందూస్థాన్ యూనిలీవర్  చీఫ్ సప్లై చైన్ అధికారి విల్లెం ఉజ్జెన్ తో భేటీలో  విశాఖలో ఆ సంస్థ 330 కోట్ల రూపాయల పెట్టుబడితో  యూనిలీవర్‌ను బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అంగీకరింపచేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగిం చుకోవచ్చని, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందనీ వివరించారు. ఇంకా  సెన్మట్ హెడ్ రాబర్టో బోకాతో భేటీలో  గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా  సహకారం అందించాలని కోరారు.  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.   అలాగే  ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. 

ఇక చివరి రోజైన గురువారం (జనవరి 23) కూడా చంద్రబాబు వివిధ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బిజీబిజీగా కడిపారు.  ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్‌ వైస్-ఛైర్మన్ ఆండ్రే హాఫ్‌మన్‌తో భేటీ అయ్యారు. అలాగే యూఎన్‌డీపీ అధిపతి అచిమ్ స్టెయినర్, సీఎన్ఎన్ బెకీ ఆండర్సన్‌తోనూ చర్చించారు. మొత్తం మీద బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా సాగిన ఆయన దావోస్ పర్యటన విజయవంతమైంది.