ఏపీ సర్కార్ కు సోనూ సోద్ అంబులెన్సుల వితరణ | sonu sood donates ambulances tp ap government| meet| cbn
posted on Feb 3, 2025 4:22PM
సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. కరోనా సమయంలో ఆయన బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా వలస కార్మికులు తన సొంత ఊర్లకు వెళ్లడానికి ఆయన ఎంతో సహాయం చేశారు. అలాగే కరోనా కష్టకాలంలో ఆయన ఎందరికో అండగా నిలిచారు. ఆర్థిక భరోసా ఇచ్చారు. సొంత ఆస్తులను అమ్మి మరీ తన సేవలు కొనసాగించారు. కరోనా సమయంలోనే కాదు, ఆ తరువాత కూడా ఎవరైనా కష్టంలో ఉన్నారని తన దృష్టికి వచ్చిన వెంటనే తానున్నానంటూ సహాయ హస్తం అందించారు.
అటువంటి సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ట్రస్ట్ తరఫున అంబులెన్సులను అందించారు. సచివాలయంలో సోమవారం (ఫిబ్రవరి 3) ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకు అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించారు. తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోనూ సూద్ ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు సాయంగా అంబులెన్సులను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.