posted on Feb 7, 2025 11:15AM
మహా కుంభమేళాలో మరో సారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కుంభమేళాలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిదే. తాజాగా సెక్టార్-18లోని శంకరాచార్య మార్గ్ టెంట్లు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. . ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
వసంత పంచమి సందర్భంగా కుంభమేళాకు భక్తులు పోటెత్తిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కుంభమేళాలో వరుస ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించి భక్తుల భద్రతకు మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలా ఉండగా గురువారం వరకూ మహా కుంభమేళాకు 39 కోట్ల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహా కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది.