Leading News Portal in Telugu

Shreyas Iyer: మనసున్న మారాజు శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంతకీ ఏం చేశాడంటే? వీడియో వైరల్


Indian Batter Shreyas Iyer donates Money to Poor Childrens: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఏన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయస్‌.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023కి ముందు న్యూజిల్యాండ్ వెళ్లి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఏన్‌సీఏలో చేరి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్నాడు.

ప్రస్తుతం బెంగళూరులోని ఏన్‌సీఏలో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌.. బుధవారం బయటకు వచ్చాడు. శ్రేయస్‌ కారులో వెళ్తున్న సమయంలో ఓ తండ్రి తన చిన్నారితో కలిసి టీమిండియా క్రికెటర్ వద్దకు వెళ్లి డబ్బు సాయం కోరాడు. దాంతో అయ్యర్‌ వెంటనే తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ తండ్రితో నవ్వుతూ మాట్లాడిన శ్రేయస్‌.. జేబులో నుంచి కొంత డబ్బును తీసి ఇచ్చేశాడు. పక్కన ఉన్న మరో వ్యక్తికి కూడా డబ్బు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇది చూసిన నెటిజన్లు శ్రేయస్‌ను పొగిడేస్తున్నారు. ‘మంచి మనసున్న మారాజు శ్రేయస్‌ అయ్యర్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వెన్ను గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. ఏన్‌సీఏలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రతిరోజు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ బయటికి వచ్చాయి. శ్రేయస్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ రెండు రోజులో శ్రేయస్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో అతడు పాస్ అయితే ఆసియా కప్‌ 2023లో రీ ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు ప్రపంచకప్ 2023లో కూడా ఆడతాడు. కీలక నాలుగో స్థానంలో శ్రేయస్‌ కుదురుకున్న విషయం తెలిసిందే.