Leading News Portal in Telugu

Asia Cup 2023: ఆసియా కప్‌ 2023లో ముగ్గురు అందాల భామలు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూతురు కూడా!


Mayanti Langer, Jaiti Khera and Zainab Abbas are Presenters for Asia Cup 2023: మరో వారం రోజుల్లో ఆసియా కప్ 2023 తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా టోర్నీ జరగనుంది. 2018 తర్వాత మొదటిసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉండగా.. శ్రీలంకలో 9, పాక్‌లో 4 జరగనున్నాయి.

ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్నా.. భారత్ కారణంగా తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ మ్యాచ్‌లను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. మరోవైపుకు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాప్‌లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్‌ చూడొచ్చు. పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

2023 ఆసియా కప్‌కు సంబంధించిన ప్రెజెంటర్ ప్యానెల్‌ను స్టార్ స్పోర్ట్స్ తాజాగా విడుదల చేసింది. మొత్తంగా ఐదుగురితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. ప్రెజెంటర్ ప్యానెల్‌లో ఇద్దరు మేల్ యాంకర్లు కాగా, మిగిలిన ముగ్గురు ఫిమేల్ యాంకర్లు. జతిన్ సప్రూ మరియు తనయ్ తివారీ మేల్ ప్రెజెంటర్లు కాగా.. మయాంతి లాంగర్, జైతీ ఖేరా మరియు జైనాబ్ అబ్బాస్ ఫిమేల్ ప్రెజెంటర్లు (Asia Cup 2023 Female Anchors).

మయాంతి లాంగర్:
మయాంతి లాంగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి ఈవిడ. అంతేకాదు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కోడలు కూడా. స్టార్ స్పోర్ట్స్‌లో చాలా కాలంగా మయాంతి పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసే అన్ని క్రికెట్ సిరీస్‌లకు మయంతి వ్యాఖ్యాతగా ఉంటారు. ఆమె స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ ఛానెల్‌లలో కనిపిస్తుంటారు. అందం, అభిమానం, మాటలతో మయాంతి మాయ చేస్తారు.

జైతీ ఖేరా:
ఓటీటీలో ఆకట్టుకున్న కోటా ఫ్యాక్టరీ సీజన్ 2, ఢిల్లీ క్రైమ్ సీజన్ 1లో జైతీ ఖేరా నటించారు. ఆపై ఐపీఎల్‌లో టీవీ వ్యాఖ్యాతగా కనిపించారు. ఇప్పుడు ఆసియా కప్‌ 2023లో ప్రెజెంటర్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు.

జైనాబ్ అబ్బాస్:
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నాసిర్ అబ్బాస్ కూతురు జైనాబ్ అబ్బాస్. ఈసారి ఆసియా కప్‌లో టీవీ యాంకర్‌గా ఈమె సందడి చేయనున్నారు. 2015లో పాక్ స్థానిక ఛానెల్‌లో కెరీర్ ప్రారంభించిన జైనాబ్.. అంచలంచెలుగా ఎదిగారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి టీవీ ప్రెజెంటర్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆమె టీ20 లీగ్‌లలో వ్యాఖ్యాతగా ఉన్నారు.