Leading News Portal in Telugu

Neeraj Chopra: మంచి మనసు చాటుకున్న నీరజ్‌ చోప్రా.. పాకిస్తాన్ ఆటగాడిని పిలిచి మరీ..!


Neeraj Chopra asks Pakistan’s Arshad Nadeem to join him for photo: టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత జావెలిన్‌ త్రో సంచలనం నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం గెలిచి మరోసారి భారతదేశం గర్వపడేలా చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో నీరజ్ ఈటెను 88.17 మీటర్లు విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లు విసిరి రజతం గెలవగా.. చెక్‌కు చెందిన వద్లెచ్‌ 86.67 మీటర్లు విసిరి కాంస్యం అందుకున్నాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ నిలిచాడు.

అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్వర్ణ పతకం గెలిచిన నీరజ్‌ చోప్రా.. రజత పతకం అందుకున్న పాకిస్థాన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందించుకున్నారు. ఆపై నీరజ్‌ సహా కాంస్యం అందుకున్న వద్లెచ్‌.. తమ తమ దేశ జాతీయ జెండాలను పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఆ సమయంలో పాక్‌ ఆటగాడు అర్షద్‌ అక్కడ లేడు. దీన్ని గమనించిన నీరజ్.. అర్షద్‌ను పిలిచి మరీ తన పక్కన నిలబెట్టుకుని ఫొటో దిగాడు. ఇందుకు సమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీరజ్ చోప్రా చేసిన మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నీరజ్‌.. నువ్ గ్రేట్’, ‘నీరజ్‌.. నీది ఎంత మంచి మనసు, ‘నీరజ్.. నువ్వు సూపర్‌’, ‘నీరజ్ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఛాంపియన్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజా స్వర్ణంతో నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్‌ ఈవెంట్లలో పతకాలు గెలిచాడు. మరోవైపు ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. ఇందులో నీరజ్ రెండు సాధించాడు.