ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. క్యాండీలోని పాలకల్లే గ్రౌండ్ లో రేపు (శనివారం) దాయాది దేశాల మధ్య పోరు జరుగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి. అయితే, ఈ మ్యాచ్లో గెలిచి పాకిస్తాన్కు మరోసారి ఓటమి రుచి చూపించాలని భారత్ అనుకుంటుంటే.. పాకిస్తాన్ మాత్రం గత టీ20 ప్రపంచకప్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది.
టీ20 వరల్డ్ కప్ తర్వాత చిరకాల ప్రత్యర్థి జట్లు ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. ఇక ఇది ఇలా ఉండగా ఆసియాకప్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు మాత్రం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. ఆసియాకప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కోహ్లి తన పేరు మీద లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఏకంగా 183 రన్స్ చేసి రికార్ట్ సృష్టించాడు. తాజాగా ఆసియాకప్ ఆరంభ గేమ్ నేపాల్ తో పాక్ ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజం 151 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్(143), యూనిస్ ఖాన్(144), ముస్తిఫిజర్ రెహ్మాన్(144)లను బాబర్ ఆజం అధిగమించాడు. కానీ విరాట్ కోహ్లీ రికార్డును మాత్రం బాబర్ టచ్ కూడా చేయలేకపోయాడు. అయితే టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి విరట్ ఘనతను ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో అనేది వేచి చూడాలి.. కాగా, ఆసియాకప్ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 613 పరుగులతో పన్నెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నమెంట్లో కోహ్లీ మరో 358 రన్స్ చేస్తే.. ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండుల్కర్ (971) రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.