Leading News Portal in Telugu

INDvsPAK: రోహిత్ ఆ ముగ్గురితో జర జాగ్రత్త..!


ఆసియా కప్‌-2023 టోర్నమెంట్ లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి రోహిత్‌ సేన టోర్నీలో శుభారంభం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, పాక్‌ పేస్‌ దళం వ్యూహాలను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవాలి.. లేకపోతే చేదు అనుభవం తప్పదని హెడెన్‌ వార్నింగ్ ఇచ్చాడు. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో రేపు (శనివారం) టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. గ్రూప్‌-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్ తదుపరి మ్యాచ్‌లో భారత్ తో పోటి పడుతుంది అని మాథ్యూ హెడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఈ భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మథ్యూ హెడెన్ అన్నారు. అయితే, పాకిస్తాన్‌ పేస్‌ విషయంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. షాహిన్‌ ఆఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా.. వైవిధ్యం కలిగిన బౌలర్లు అంటూ ఆయన పేర్కొన్నారు. భారత బ్యాటర్ల కోసం ఇప్పటికే వ్యూహాలు రెడీ చేసుకున్నారు.. క్యాండీలో బౌన్సీ వికెట్‌కు ఛాన్స్ ఉంది.. కాబట్టి పేసర్ల విషయంలో ముఖ్యంగా రవూఫ్‌ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి.. ఒక్కసారి పట్టు దొరికితే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను అతలాకుతలం చేస్తాడని హెడెన్ చెప్పాడు.

ఇక షాహిన్‌ ఆఫ్రిది.. గత వరల్డ్‌కప్‌ టైంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే!.. షాహిన్‌ ప్రారంభంలోనే వికెట్లు తీసుకోవడం.. ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్‌ శర్మను అద్భుత బంతితో అవుట్‌ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు.. కాబట్టి ఈసారి షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్ ను ఎదుర్కొనేటపుడు రోహిత్‌ శర్మ అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని హెడెన్ తెలిపాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్‌లో మొదటి మూడు ఓవర్లలో జర చూసుకోని ఆడాలని సూచించాడు. అయితే, పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని.. తద్వారా జట్టుకు విజయం అందించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.